ఓ వైపు ఫ్లాప్ టాక్ తో ఇబ్బంది పడుతున్న అల్లు అర్జున్ ‘వరుడు’ చిత్రానికి తెలంగాణ పోటు తోడయింది. తెలంగాణా జేఏసీ డివిజన్ కన్వీనర్ అంబటి శ్రీని వాస్ ఈ సినిమాను ఆదరించవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణను అడ్డుకునే సీమాంధ్ర నేతల చిత్రాలను ప్రదర్శించవద్దని యజమానులకు సూచించారు. సమైక్యవాదానికి మద్దతు పలుకుతున్న పీఆర్పీ అధినేత చిరంజీవి మేనల్లుడు, అల్లు అరవింద్ కుమారుడు అయిన అర్జున్ నటించిన వరుడు సినిమా ప్రదర్శనను ఆపాలన్నారు. అలాగే ఆ సినిమాలను ప్రజలు ఆదరించవద్దని పిలుపునిచ్చారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. అయితే ముందుగా బుక్ చేసుకున్న వారు మాత్రం ఈ సంఘటనతో ఇబ్బంది పాలయ్యారు. ధియోటర్ యాజమాన్యం తమ డబ్బుని తిరిగి ఇస్తుందా లేదా అన్న అనుమానాలు చోటు చేసుకున్నాయి.
ఇక కొన్ని ఏరియాల్లో తొలిరోజునే ‘వరుడు’ చేదు అనుభవం ఎదుర్కొన్నాడు. తెలంగాణవాదులు బుధవారం నర్సంపేటలోఈ చిత్ర ప్రదర్శన అడ్డుకున్నారు. రాంరాజ్ కళామందిర్లో మొదటి ఆటగా ప్రదర్శించేందుకు యాజమాన్యం సిద్ధమవుతుండగా, స్థానిక జేఏసీ నాయకులు, కార్యకర్తలు థియేటర్లోకి చొచ్చుకువచ్చి వరుడు చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, కటౌట్లను దహనం చేశారు. సమైక్యవాదుల వ్యాపారాలను తెలంగాణలో కొనసాగినిచ్చేది లేదని గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు వరుడు సినిమాను అడ్డుకున్న ట్లు ఆందోళనకారులు తెలిపారు.అలాగే జయశ్రీ థియేటర్లో ప్రదర్శిస్తున్న ఆర్య-2ను కూడా అడ్డుకున్నారు. థియేటర్ల ముందు ఆందోళన చేపట్టారు. ప్రేక్షకులను బయటికి పంపించారు. థియేటర్ల ఆవరణలో ఫ్లెక్సీలను తగులబెట్టారు. చిత్రాన్ని బహిష్కరిం చాలని పిలుపునిచ్చారు. అనంతరం రాస్తారోకోకు దిగారు. ఇక గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించారు. భారీ బడ్జెట్ తో విపరీతమైన పబ్లిసిటీతో వచ్చిన ఈ చిత్రంలో విషయం ఆ రేంజిలో లేకపోవటం అందరినీ నిరాశపరుస్తోంది.